నిజామాబాద్, 22 July
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ రెవెన్యూ శివారులోని కుండలిని జ్ఞానయోగి అవధూత శ్రీశ్రీశ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో సప్త భజనలు విజయవంతంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బెంగళూరుకు చెందిన ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ, మనసును ప్రశాంతపరిచేవి భజనలే అని, కుటుంబ సమేతంగా పాల్గొనవలసిన సత్కార్యం ఈ సప్త భజన అని పేర్కొన్నారు.
మనసును ప్రశాంతపరిచేవి భజనలే అని, ఒక్కరు, దంపతులే కాకుండా కుటుంబ సమేతంగా పాల్గొనవలసిన సత్కార్యం ఈ సప్త భజన అని బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి అన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం వేల్పూర్ రెవెన్యూ శివారులో గల కుండలిని జ్ఞానయోగి అవధూత శ్రీశ్రీశ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో గోవిందగిరి స్వామి శిష్యుడు బెంగళూరుకు చెందిన శ్రీ రాఘవేంద్ర స్వామి బుధవారం ఓంకార రూప కాషాయ జెండాను ప్రతిష్టించి జ్యోతి ప్రకాశనం చేశారు. సప్తభజనల్ని ప్రారంభించి ప్రప్రథమంగా వీణను ధరించారు.
గోవిందగిరి స్వామి శిష్యులు "తారక నామమే మధురమురా, ఆ స్మరణే ముక్తికి మార్గమురా, దిగంబరా దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా, గురు మారాజ్ గురూర జై జై, పరాబ్రహ్మ సద్గురూర జై జై" అంటూ.. నిరవధికంగా భజన పాటలు పాడుతూ సామూహికంగా భజనలు చేశారు. అష్టోత్తర శతనామాల్ని పఠించారు.
గురునామాల్ని చదువుతూ ఫత్తేపూర్ కు చెందిన శంకయ్యగారి నీరజ సునీల్ రెడ్డి దంపతులు, అంక్సాపూర్ కు చెందిన పాశం (అరుణ) మేఘన మల్లారెడ్డి దంపతులు గురుపాదుకపూజ నిర్వహించారు.
చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్న సప్త భజనలు ఆశ్రమ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చిపెట్టాయి. అనంతరం భజన కళాకారులకు నోముల సులోచన గంగారెడ్డి దంపతులు ఆత్మీయ జ్ఞాపికల్ని బహూకరించారు.
ఇట్టి సప్త భజన మహోత్సవంలో శ్రీ రాఘవేంద్ర స్వామి (బెంగళూరు), ఆలయ అర్చకుడు ప్రవీణ్ పంతులు, కమిటీ సభ్యులు, భజన కళాకారులు సాయి సేవకులు, గోవిందగిరి స్వామి శిష్యులతో పాటు వేల్పూర్, సీతారాం పల్లె, వెంకటాపూర్, మోతె, భీంగల్, చేంగల్, గోవింద్ పేట్, మామిడిపల్లి, ఆర్మూర్, పెర్కిట్, లక్కోర, రెంజర్ల, తాళ్లరాంపూర్ తదితర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.












