జిల్లాలో బ్యాంకుల సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు అన్ని బ్యాంకుల ద్వారా రూ.8,409.62 కోట్ల రుణాలు మంజూరు చేయబడ్డాయని తెలిపారు. లక్ష్య సాధనలో 64.56 శాతం పురోగతి నమోదైందని వెల్లడించారు.
బ్యాంకులు ప్రజల ఆర్థిక అభివృద్ధికి కీలకంగా పనిచేయాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలు, సబ్సిడీ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థంగా చేరవేయాలని ఆయన సూచించారు.
బ్యాంకింగ్ సేవల ద్వారా స్వయం ఉపాధి, వ్యాపారాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డ్ డీడీఎం వీరభద్రుడు, బ్యాంకర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


