సారంగాపూర్ మండలంలో భూభారతి అవగాహన సదస్సులు విజయవంతం
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 19 :-
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి, నాగపూర్ గ్రామాల్లో తహసీల్దార్ శ్రీదేవి ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమంపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిధరులు సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భూముల పరంగా రైతులకు ఉన్న సమస్యలు, హక్కుల వివరాలు, భూభారతి చట్టం ద్వారా లభించే లబ్ధుల గురించి వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న భూభారతి చట్టం పేదలకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. రైతులకు స్పష్టమైన భూ హక్కులను కల్పించి, భూ సంబంధిత వివాదాలను నివారించేందుకు ఈ చట్టం ఎంతో ఉపయుక్తమవుతుందన్నారు.
ఈ సమావేశాల్లో మండల రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ అరవింద్, స్వప్న, రాకేష్, శేఖన్న, శ్రీకాంత్, రాజలింగు, అసిస్టెంట్ అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. రైతుల నుండి వచ్చిన ప్రశ్నలకు సిబ్బంది సమాధానాలు ఇచ్చారు.
ఈ అవగాహన కార్యక్రమం రైతుల్లో చైతన్యం తీసుకొచ్చిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.